బీఆర్ఎస్ ఎమ్మెల్యే హౌజ్ అరెస్ట్..!

సామాన్య ప్రజల సొంతింటి కలను నిజం చేయడం కోసం ఏర్పడ్డ హౌసింగ్ బోర్డు ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థగా మారి మోసపూరితంగా భూములును అమ్మడం పట్ల ఏమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ మండలి (TSHB) మోసపూరిత వైఖరిని ఎండగడుతూ రోడ్డులో పోతున్న ప్లాట్ల వేలం ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వేలం పాట ను అడ్డుకుంటామని ప్రకటించిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తో పాటు నియోజకవర్గం లోని బీ ఆర్ ఎస్ పార్టీ కార్పొరేటర్లు, ముఖ్యనాయకులను పోలీసులు శుక్రవారం హౌస్ అరెస్ట్ చేశారు.
ఉదయం ఆరుగంటల నుంచి పెద్దయెత్తున పోలీసులను మోహరించి ఎక్కడిక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. అయినప్పటికీ వందలాదిగా నాయకులు కార్యకర్తలు ఎం ఎల్ ఏ మాధవరం కృష్ణారావు నివాసానికి తరలివచ్చారు. దీంతో పోలీసులు ఇంటికి నలువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి నాయకులు కార్యకర్తలను నియంత్రించేందుకు ప్రయత్నించారు. కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నలుగురు ఇన్స్పెక్టర్లు నాలుగు పోలీసుస్టేషన్ల సిబ్బందిని మొహరించి వేలం పాట కు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలో సామాన్య ప్రజలు హౌసింగ్ బోర్డు చేతిలో మోసపోవద్దని సూచించారు.
ఏకంగా హుడా మాస్టర్ ప్లాన్ లో 100 ఫీట్లు రోడ్డుగా చూపిన kphb 15 వ ఫేస్ లోని ఖాళీ స్థలాలను, 200 ఫీట్ల రోడ్డుగా చూపిన 7 వ ఫేస్ లోని ఖాళీ స్థలాలను మోసపూరితంగా 80 అడుగుల రోడ్డుగా చూపుతూ రోడ్డు స్థలాలను అమ్మకానికి పెట్టడం హౌసింగ్ బోర్డు అధికారుల నీతి మాలిన చర్యకు నిదర్శనమన్నారు. గడిచిన ఐదు రోజులుగా రోడ్డు స్థలాలను వేలం వేయొద్దని, సామాన్య ప్రజలను మోసం చేయొద్దని హౌసింగ్ బోర్డు అధికారులను కోరినప్పటికీ పట్టించుకోకపోవడంతో వేలాన్ని అడ్డుకుంటామని ప్రకటించినట్లు తెలిపారు. 80 ఫీట్ల రోడ్డుగా నమ్మించి అమ్ముతున్న ఖాళీ స్థలాలను కొనుగోలు చేసిన వారు రోడ్డు విస్తరణతో ప్లాట్లను కోల్పోతారని అప్పుడు ghmc ద్వారా నష్టపరిహారం ఇప్పించాలని రోడ్డు ఎక్కుతారని ఇవ్వని ముందస్తుగా గ్రహించి హౌసింగ్ బోర్డు అధికారులు రోడ్డులో పోయే ప్లాట్లను వేలం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
అంతే కాకుండా జీవో నంబర్ 6 ప్రకారం వందగజాల లోపు స్థలాల్ని పక్క ఇంటివారికి లేదా పక్కనే ఉన్న ప్లాట్ల యజమానులకు మార్కెట్ వాల్యూ ప్రకారం కేటాయించాల్సి ఉన్నప్పటికీ వేలానికి పెట్టడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ భూములను అమ్మితే అన్ని సక్రమంగా ఉంటాయని సామాన్య ప్రజలు నమ్మకంతో కొంటారని అయితే హౌసింగ్ బోర్డు అధికారులు మాత్రం ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రోడ్డులో ప్లాట్ పోతే కొన్నవారికి రోడ్డు నిర్మాణం చేస్తున్న సంస్థ(ghmc) నష్టపరిహారంగా టీ డి ఆర్ (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) ఇస్తుందని చెపుతున్న హౌసింగ్ బోర్డు అధికారులు అదే టీడీఆర్ ను వారే తీసుకోవచ్చుకదా అని ప్రశ్నిస్తే మాత్రం సమాధానం చెప్పడం లేదని అన్నారు.
టీడీఆర్ గృహ నిర్మాణ సంస్థ అయిన హౌసింగ్ బోర్డు కు ఎక్కువగా ఉపయోగపడుతుందని, సామాన్యులకు పావు వంతు కూడా ఉపయోగం ఉండదని తెలిపారు. ప్రజాస్వామ్యయుతంగా నిబంధనలమేరకు హౌసింగ్ బోర్డు స్థలాల వేలంలో పాల్గొనేందుకు బ్యాంకు ద్వారా డిడి తీసుకునప్పటికీ అనుమతించకపోవడం ప్రభుత్వ అడ్డగోలు విధానాలకు అద్దం పడుతుంది. పోలీసులు కూడా పరిధి దాటి వ్యవహరిస్తున్నారనీ, చట్టప్రకారం వేలం పాట లో పాల్గొనే హక్కు ఉన్నప్పటికీ అనుమతించకపోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించారు. ఇప్పటికైనా హౌసింగ్ బోర్డు అధికారులు తమ తప్పును తెలుసుకొని వెంటనే రోడ్డు స్థలాల వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
