మరో సమరానికి సిద్ధమైన మాజీ మంత్రి హారీష్ రావు..!

9 total views , 1 views today
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో అనుసరించాల్సిన కార్యాచరణపై శుక్రవారం సంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులతో కోకాపేట లోని తన నివాసంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సునితా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్, మాజీ జెడ్పీ చైర్మన్ జైపాల్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు త్వరలో చేసే పోరాటం గురించి ఈ సమావేశంలో చర్చించారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయాలనే డిమాండ్ తో, ఆ ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
రెండేళ్ల క్రితం 2022 ఫిబ్రవరి 21న నారాయణ్ ఖేడ్ లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసారు. అధికారంలోకి వచ్చి 14నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాజెక్టుల వైపు తొంగి కూడా చూడలేదు.దీంతో సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్, ఆందోల్, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గ ప్రజల సాగు నీరు కలగానే మారింది.
దీంతో ప్రభుత్వంలో కదలిక తెచ్చి, ప్రాజెక్టులు పూర్తి చేయించి, దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంగమేశ్వర, బసవేశ్వర సాగునీటి ప్రాజెక్టులపై పోరాటానికి సిద్ధం అవుదామని పిలుపునిచ్చారు. ఆ దిశగా సంసిద్ధం కావాలని మాజీ మంత్రి హారీష్ రావు సూచించారు.
