పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టడం అభినందనీయం..!
పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు దివంగత నేత , కేంద్ర మాజీమంత్రి ఎస్. జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టడం అభినందనీయమని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం శాసన మండలిలోని తన ఛాంబర్ లో మీడియాతో చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో కీలక భూమిక పోషించిన జైపాల్ రెడ్డి గారి కృషిని ఎప్పటికి మరవలేమని ఆయన చెప్పారు. ప్రచారం తక్కువ పని ఎక్కువగా చేసే తత్వం జైపాల్ రెడ్డి గారిదన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టడాన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా స్వాగతించాలని ఆయన కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బంధుప్రీతితో ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెడుతున్నారని దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ రాష్ట్రం సాధించడం కొరకు కేంద్ర మంత్రి హోదాలో ఆయన ఎనలేని కృషి చేశారని, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకి జైపాల్ రెడ్డి పేరు పెట్టడాన్నీ తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.పాలమూరు -రంగారెడ్డి ఎత్తి పోతల పథకానికి ఎస్ . జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టడం అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే అని ఆయన అన్నారు.గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ప్రస్తుత ప్రభుత్వం ఆర్ధిక సమస్యలను ,సవాళ్లను ఎదుర్కొంటుంది..
అయినప్పటికీ రైతులను ఆదుకోవాలనే దృఢ సంకల్పంతో, ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసాను జనవరి 26 నుండి ఎలాంటి షరతులు లేకుండా సేద్యం చేసే భూమికంతటికి ఇవ్వడం అభినందనియమన్నారు . రైతు భరోసాను రూ “10000 నుండి రూ” 12000 పెంచడం గొప్ప నిర్ణయమని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి , క్యాబినెట్ మంత్రులకు శాసన మండలి ఛైర్మన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నిర్ణయం పట్ల తెలంగాణ రైతులందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. భూమిలేని రైతు కూలీలకు ఏటా 12000 రూపాయల సాయం అందించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.
సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం శుభపరిణామం అని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ప్రజాయోగ్యంగా ఉందని , ప్రతిపక్ష పార్టీలు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని ఆయన అన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులు SLBC , డిండి , ఉదయసముద్రం ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజల్లో ఉంటూ , ప్రజల అభీష్టానికి అనుగుణంగా నడుచుకొవాలని ఆయన సూచించారు.
ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల సపోర్ట్ ఎల్లవేళలా ఉంటుందని ఆయన తెలిపారు. విమర్శలు చేయడం , దుష్ప్రచారం చేయడమే పనిగా ప్రతిపక్ష పార్టీలు పెట్టుకోవద్దని , ప్రభుత్వానికి సరియైన సూచనలు ,సలహాలు ఇస్తూ ప్రజలకోసం పని చేయాలని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు.